నిజాయితీగల వ్యాపారవేత్తగా పేరు పొందిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ను కేంద్రంలో మంత్రిగా తీసుకోబోతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అని వస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చంద్రశేఖరన్కు కేబినెట్ బెర్త్ దక్కవచ్చని పలువురు రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
చంద్రశేఖరన్ ఇటీవల టాటా సన్స్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 20తో ముగిసిన తర్వాత మరోసారి చైర్మన్గా కొనసాగేందుకు ఆసక్తి లేదని ఆయన వెల్లడించారు. టాటా ట్రస్ట్స్ బోర్డు సభ్యులతో విభేదాల నేపథ్యంలో ఆగస్టు 12న ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం.
63 ఏళ్ల వయసున్న చంద్రశేఖరన్ బీజేపీలో కీలక పదవులకు సాధారణంగా అనుసరించే 75 ఏళ్ల వయోపరిమితి కంటే చాలా తక్కువ వయసులో ఉన్నారు. ఆయనకు ఏ శాఖ కేటాయించవచ్చనే చర్చలో కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించిన శాఖతో పాటు విద్యాశాఖ పేరు కూడా వినిపిస్తోంది.
మాజీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఇటీవల ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పరీక్షల సంస్కరణలపై ఉన్నతస్థాయి కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు. జంతర్మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు, నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో పరీక్షా విధానంలో సంస్కరణల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విద్యారంగంలో సమర్థవంతమైన పాలన కోసం రాజకీయేతర, కార్పొరేట్ రంగానికి చెందిన ప్రముఖులను కీలక బాధ్యతల్లోకి తీసుకురావచ్చన్న చర్చకు చంద్రశేఖరన్ పేరు బలం చేకూరుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా కాలంలో దేశానికి నలుగురు విద్యాశాఖ మంత్రులు పనిచేశారు. స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావడేకర్, రమేశ్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్ ఈ బాధ్యతలు నిర్వహించారు. వివిధ కారణాలతో వీరంతా ఆ పదవుల నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుతం తాత్కాలికంగా ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించిన తర్వాత ఈ మార్పు జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిగా చంద్రశేఖరన్ వంటి పారిశ్రామిక రంగ ప్రముఖుడిని నియమించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
