ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్లూ ఎకానమీ బూస్ట్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని 8 ప్రధాన పోర్టులకు అనుబంధంగా 8 పోర్టు సిటీలను నిర్మించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం, కృష్ణపట్నం, మూలపేట, రాంబిల్లి పోర్టుల పరిధిలో కొత్త నగరాలను అభివృద్ధి చేస్తారు. ఈ పోర్టులకు వంద కిలోమీటర్ల దూరం వరకు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి ఆ ప్రాంతంలో గొడౌన్లు, ఆఫీసులు, నివాస ప్రాంతాలు, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం మౌళిక వసతులను అభివృద్ధి చేస్తారు.
ఇండిస్ట్రియల్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్ హబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పోర్టు పరిసరాల్లో ఉన్న గ్రామాలను ఆధునిక నగరాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. సాగరమాల ఫేజ్ 2 పథకం ద్వారా.. పోర్టుల పరిధిలో 10 వేల 523 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు నిర్మిస్తారు. ఒక్కో పోర్టు పరిధిలో కొన్ని పరిశ్రమలను డెవలప్ చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నం పోర్టు సమీపంలో సీ ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తారు. మూలపేట పోర్టు దగ్గర రసాయనాలు, లాజిస్టిక్స్, శిక్షణ కేంద్రాలను డెవలప్ చేస్తారు. రాంబిల్లి పరిసరాల్లో నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికాల ఉత్పత్తి కోసం హై సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలు చేపడతారు. కాకినాడ పోర్టు ద్వారా పెట్రోలియం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కంపెనీలను అభివృద్ధి చేస్తారు.
మచిలీపట్నం పోర్టు దగ్గర ఎలక్ట్రిక్ వాహనాలు, ఆభరణాలు, ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రామాయపట్నం ప్రాంతంలో పెట్రోలియం ఉత్పత్తుల… నిల్వ, పంపిణీ నెట్వర్క్ డెవలప్ చేస్తారు. దుగరాజపట్నం పోర్టు చుట్టూ షిప్ బిల్డింగ్, రోబోటిక్ షిప్యార్డు, డాక్ యార్డుల నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి ఎలక్ట్రానిక్స్, సోలార్ పవర్ మాడ్యూల్స్, విద్యుత్ కార్ల ఎగుమతి కంపెనీలను నెలకొల్పుతారు. ఈ విధంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు రాష్ట్రంలోని తీర ప్రాంతంలో 8 కొత్త నగరాల నిర్మాణం ద్వారా.. బ్లూ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేసి ఏపీ ఆర్ధికాభివృద్ధికి బూస్టు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
