చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కల్పన విషయంలో భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదని, ఆ పార్టీ మహిళలను మరోసారి వంచించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టిందని, దీనివల్లనే లోక్సభలో బిల్లు వీగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆమె విమర్శించారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని తెలిసినప్పటికీ, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ రెండు అంశాలను కలిపి పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందని ఆరోపించారు. గతంలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో బిల్లును ప్రవేశపెట్టి, దానిని సెన్సస్తో లింక్ చేశారని.. ఇప్పుడు మళ్ళీ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన బిల్లు అంటూ సరికొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు.
రాబోయే 2027 జనాభా గణనలో ఓబీసీలను కూడా లెక్కించి, ఆ గణాంకాల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాల మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు బీజేపీ చేస్తున్న ఈ మోసాన్ని గమనించాలని ఆమె పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఒక మహిళా నాయకురాలు (మమతా బెనర్జీ) పోరాడుతున్నారని, ఈ వంచక రాజకీయాలను ఓడించి ఆమెను గెలిపించాలని బెంగాల్లో ఉన్న స్నేహితులకు, బంధువులకు తెలియజేయాలని కోరారు. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యంపై బీజేపీ కేవలం మాటలకే పరిమితమైందని, ఆచరణలో మహిళా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.
