ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విషం చిమ్ముతూ వైసీపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని జనసేన పార్టీ నేత, పెందుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన చేపట్టడాన్ని పంచకర్ల తప్పుబట్టారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఆ పర్యటన నిర్వహించారని ఆరోపించారు.
విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. ప్రజలు తిరస్కరించిన తర్వాతైనా వైఎస్ జగన్కు వాస్తవాలు అర్థమవుతాయని భావించామని, కానీ ఇప్పటికీ అదే వైఖరి కొనసాగిస్తున్నారని అన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటును గతంలో వైఎస్ జగన్ వ్యతిరేకించిన విషయాన్ని పంచకర్ల గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడు సమిష్టిగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ నేతలను విమర్శించే నైతిక హక్కు మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని పంచకర్ల రమేష్ బాబు మండిపడ్డారు. సజ్జల వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని, మరోసారి అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేసినా లేదా కూటమి నేతలపై అవాకులు చవాకులు మాట్లాడినా సహించబోమని హెచ్చరించారు. “ఖబడ్దార్” అంటూ వైసీపీ నేతలకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ఎలాంటి ప్రయత్నాలనైనా ప్రజలు సహించరని, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు.
