పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మే 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుండగా, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మే 9న జరగనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య మంగళవారం ప్రకటించారు.
బీజేపీ తూర్పు భారతదేశంలో కీలక విజయాన్ని నమోదు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ముఖ్యమంత్రి పదవికి ఎవరు ఎంపికవుతారనే అంశంపై నిలిచింది. ఈ రేసులో ప్రధానంగా సువేందు అధికారి పేరు ముందంజలో వినిపిస్తోంది. మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేరు కూడా చర్చలో ఉంది. మరోవైపు మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ సందేశాన్ని బలపరచేందుకు మహిళను సీఎం చేయవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది.
అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో సువేందు అధికారికే అత్యధిక అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదలకు ప్రధాన శక్తిగా నిలిచారు. 2021లో నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించిన ఆయన, ఈసారి భవానీపూర్లో కూడా ఆమెపై విజయం సాధించి చరిత్ర సృష్టించారు. వరుసగా రెండుసార్లు సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఓడించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
2007లో నందిగ్రామ్లో టాటా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మమతాతో కలిసి పోరాడిన సువేందు అధికారి, అప్పట్లో తృణమూల్ ఎదుగుదలకు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అమిత్ షా విసిరిన రెండు స్థానాల సవాల్ను స్వీకరించి నందిగ్రామ్, భవానీపూర్ రెండింటిలోనూ విజయాన్ని అందుకోవడం ఆయన రాజకీయ ప్రభావాన్ని మరింత బలపరిచింది.
ఇప్పుడు మే 9 ప్రమాణ స్వీకార వేడుకకు ముందు బీజేపీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుండగా, బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరే బలంగా వినిపిస్తోంది.
