గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్–2026’ క్రీడా పోటీలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. దేశ నిర్మాణానికి, యువత సాధికారతకు సాధనంగా క్రీడలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ఖేలో ఇండియా, ఆసియా క్రీడలు, ప్రపంచ పోలీసు–అగ్నిమాపక క్రీడలు తదితర కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతులను కేంద్రం విస్తరిస్తోందని చెప్పారు.
కేంద్రం క్రీడల బడ్జెట్ను రూ.4,480 కోట్లకు పెంచిందన్నారు. గతేడాది కేటాయింపుల కంటే ఇది రూ.1,100 కోట్లకు పైగా అధికంగా ఉందని తెలియజేశారు. ప్రపంచ క్రీడాశక్తిగా ఎదగాలన్న భారత లక్ష్యాన్ని శ్రీ బండి సంజయ్ కుమార్ పునరుద్ఘాటించారు. 2047 నాటికి అయిదు అగ్ర క్రీడా దేశాల్లో ఒకటిగా మారాలన్న దేశ దీర్ఘకాలిక ఒలింపిక్ లక్ష్యం గురించి వివరించారు.
‘‘ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బందిని ఒకే వేదిక మీదకు తీసుకువస్తాయి. స్నేహాన్ని, పరస్పర అవగాహనను, సోదరభావాన్ని పెంపొందిస్తాయి. తద్వారా జాతీయ ఐక్యతను, దేశ సమగ్రతను బలోపేతం చేస్తాయి’’ అని ఆయన అన్నారు.
పోలీసు క్రీడల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దీనిని సమ్మిళిత్వం, సాధికారత దిశగా వేసిన ముందడుగుగా వర్ణించారు. ఈ పోటీలు స్వర్ణం, రజతం, కాంస్య పతకాలను గెలవడం కోసం మాత్రమే కాదని అభిప్రాయపడ్డారు. ‘‘దేశభద్రతను కాపాడుతూ, కీలకమైన ప్రదేశాలకు రక్షణ కల్పిస్తూ, ప్రజాక్షేమం కోసం నిరంతరం శ్రమించే భద్రతా దళాలు, పోలీసుల జీవితాల్లో క్రీడలు విడదీయరాని భాగం’’ అని ఆయన తెలిపారు.
1969 నుంచి దేశంలో అత్యంత కీలమైన ఆస్తులకు, మౌలిక వసతులకు అవసరమైన భద్రతను సీఐఎస్ఎఫ్ అందిస్తోందని కేంద్ర హోం వ్యవహరాల సహాయ మంత్రి చెప్పారు. వాటిలో విమానశ్రయాలు, ఢిల్లీ మెట్రో, వారసత్వ కట్టడాలు, అణు, అంతరిక్ష సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, జైళ్లు, దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు సముదాయం ఉన్నాయన్నారు.
‘‘ఇటీవలే జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అభిమన్యు స్వర్ణ పతకం సాధించారు. అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్స్లో మూడో స్థానాన్ని సాధించారు. ఇది మనందరికీ గర్వకారణం. ఇది క్రీడలకు సీఐఎస్ఎఫ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, ఇటీవలే సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం నాకు నిజంగా గర్వాన్ని కలిగించింది.
అథ్లెట్లకు నేరుగా ఆర్ధిక సహాయం
అథ్లెట్ల సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన కార్యక్రమాలను ఈ దళం చేపడుతోంది. సంక్షేమ పథకాలను విస్తరించింది. అథ్లెట్లకు ఇప్పుడు నేరుగా అదనపు ఆర్థిక సాయం లభిస్తోంది. నాణ్యమైన పోషకాహారం, ఆధునిక క్రీడా సామగ్రి లేదా గాయాల నుంచి త్వరగా కోలుకోవడానికి అవసరమైన సౌకర్యాల విషయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. ఈ చర్యలన్నీ మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, దేశానికి మరిన్ని విజయాలను తీసుకురావడానికి దోహదపడతాయి’’ అని ఆయన అన్నారు.
సీఐఎస్ఎఫ్ ఏడీజీ (సౌత్) పద్మాకర్ ఎస్ రన్పిసే, సీఐఎస్ఎఫ్ ఏపీఎస్–II ఐజీ ఎస్ఆర్ శరవణన్, సీఐఎస్ఎఫ్ ఐజీ, ఎన్ఐఎస్ఏ డైరెక్టర్ హర్ప్రీత్ కౌర్ సోహి, పీఐబీ ఏడీజీ శ్రుతి పాటిల్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2026 జులై 23 నుంచి 30 వరకు 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్–2026 పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో 36 రాష్ట్ర పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) విభాగాలకు చెందిన 1,600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరు జూడో, వుషు, తైక్వాండో, కరాటే, పెన్చాక్ సిలాట్ క్రీడల్లో పోటీపడతారు.
