హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–IIలో మిగిలిన మెయిన్ కెనాల్, CC లైనింగ్, నీవా బ్రాంచ్ కెనాల్ తదితర పనులను పూర్తి చేసేందుకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు కావడంపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో పాటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో అన్నమయ్య జిల్లా ప్రజల చిరకాల నీటి అవసరాలకు పరిష్కారం లభించే దిశగా కీలక ముందడుగు పడిందని మంత్రి పేర్కొన్నారు.
HNSS మెయిన్ కెనాల్ను తొలుత లైనింగ్ లేకుండా నిర్మించడంతో డిజైన్ చేసిన 2,520 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో అందించడంలో ఇబ్బందులు ఉన్నాయని మంత్రి తెలిపారు. అందువల్ల మిగిలిన కాలువ పనులతో పాటు CC లైనింగ్ పనులను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో HNSS మెయిన్ కెనాల్ కిమీ 400.500 నుంచి 485.300/490.000 వరకు మిగిలిన పనులకు రూ.750.07 కోట్లు కేటాయించేందుకు అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. అలాగే అన్నమయ్య జిల్లాలో కిమీ 490.000 నుంచి 554.175 వరకు మెయిన్ కెనాల్ పనులతో పాటు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.573.68 కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు.
రాయచోటి నియోజకవర్గ పరిధిలో HNSS మెయిన్ కెనాల్ కిమీ 490 నుంచి 535 వరకు సుమారు 45 కిలోమీటర్ల మేర పనులు ఉన్నాయని మంత్రి మండిపల్లి తెలిపారు. ఈ పనులకు సుమారు రూ.290 కోట్లు, అదనంగా రూ.60 కోట్లతో కలిపి మొత్తం దాదాపు రూ.350 కోట్ల విలువైన పనులు చేపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కిమీ 463 నుంచి 554 వరకు HNSS మెయిన్ కెనాల్ పనులను ఒకే సింగిల్ ప్యాకేజీగా చేపట్టే ప్రతిపాదన ఉందని, దీనిలో రాయచోటి నియోజకవర్గ పరిధిలోని 490–535 కిలోమీటర్ల పనులు కూడా భాగం కానున్నాయని తెలిపారు.
ఈ పనులు పూర్తయితే HNSS ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో పనిచేసే అవకాశం ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. తద్వారా కేవీ పల్లి, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి, పీలేరు, చిత్తూరు ప్రాంతాలకు తాగునీటి సరఫరాతో పాటు సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రాజెక్టు మరింత ఉపయోగపడుతుందని చెప్పారు.
HNSS ద్వారా సుమారు 25 వేల ఎకరాల పరిధిలో ఖాళీగా ఉన్న చెరువులను నింపి ప్రజలకు నీటి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి తెలిపారు. కాలువ ద్వారా శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను అనుసంధానం చేయడంతో పాటు మార్గమధ్యంలోని ఖాళీ చెరువులను కూడా నింపేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరారు.
రాయచోటి నియోజకవర్గంతో పాటు అన్నమయ్య జిల్లా ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలకు HNSS పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు సాధ్యమైనంత త్వరగా నీటి ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా ప్రజల చిరకాల నీటి అవసరాలను గుర్తించి HNSS పనులకు రూ.1,323.75 కోట్ల భారీ నిధులతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చొరవ, దూరదృష్టితో ఈ ప్రాంతంలో తాగునీరు, సాగునీటి భరోసా మరింత బలోపేతం కానుందని ఆయన పేర్కొన్నారు.
