రాష్ట్రంలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల ఉన్నత విద్య కోసం బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లిలో ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ (ఎఫ్.ఎ.సి.) ఎం. వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ (ప్రోగ్రామ్-II) జి.ఓ.ఎం.ఎస్. నం. 16, తేది: 31.07.2026 ద్వారా నూతన కళాశాల ఏర్పాటుకు అనుమతి లభించిందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రతిష్టాత్మక “ఇంద్రధనుస్సు – దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం” కింద ఈ కళాశాల ఏర్పాటవుతోందని వెల్లడించారు.
ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరం నుండే ఈ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని, ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సర్టిఫికేషన్ కోర్సుతో కూడిన బి.కాం. (కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రధాన సబ్జెక్టుగా) కోర్సును అందిస్తున్నామని తెలిపారు. ఈ కోర్సుకు గాను మొత్తం 30 సీట్లు మంజూరయ్యాయని, అర్హత కలిగిన వినికిడి లోపం ఉన్న విద్యార్థినీ విద్యార్థుల నుండి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.
మారుతున్న సాంకేతిక విప్లవానికి అనుగుణంగా వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఈ సదవకాశాన్ని అర్హులైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
దరఖాస్తులు, ఇతర వివరాలకు బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లిలోని ప్రభుత్వ వినికిడి లోపం ఉన్న విద్యార్థుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ను సంప్రదించవచ్చని లేదా 90000 13633, 99483 72899 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో సూచించారు.
