అమరావతి చుట్టుపక్కల మళ్లీ రియల్ ఎస్టేట్ జోరు మొదలైంది. నిన్నా మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా విజయవాడ శివార్లతో పాటు గుంటూరు జిల్లా పరిధిలోని కీలక ప్రాంతాల్లో స్థిరాస్తి క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత త్రైమాసికంతో పోలిస్తే కానూరు, పడమట, తాడేపల్లి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా 15 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం.
విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే కానూరు, పడమట ప్రాంతాలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ ప్రాంతాలు ప్రధాన వాణిజ్య, నివాస కేంద్రాలకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనేందుకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో.. మొన్నటిదాకా వెలవెలబోయిన రిజిస్ట్రార్ ఆఫీసులు ఇప్పుడు జనాలతో కిటకిటలాడుతున్నాయి.
అటు గుంటూరు జిల్లా పరిధిలోని రాజధాని సరిహద్దు ప్రాంతమైన తాడేపల్లిలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం, అమరావతి కనెక్టివిటీ రోడ్ల విస్తరణ శరవేగంగా జరుగుతుండటంతో ఇన్వెస్టర్ల చూపు అటు మళ్లింది. దీనికి తోడు తాడేపల్లి, కుంచనపల్లి, వడ్డేశ్వరం పరిసరాల్లో కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభమవుతుండటంతో భూములు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి.
విజయవాడ-తాడేపల్లి బెల్ట్లో మొదలైన ఈ బూమ్..మొత్తం అమరావతి కారిడార్ రియల్ ఎస్టేట్ రంగానికే కొత్త కళ తీసుకొచ్చింది. ఈ జోరు చూస్తుంటే రాబోయే పండుగల సీజన్లో లావాదేవీలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఇటు ఆస్తుల విలువలతో పాటు అటు ప్రభుత్వ ఖజానాకు కూడా కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.
