రాజధాని అమరావతిలో నిర్మించిన సరికొత్త ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస గృహాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఐతే ఈ నెల 24న సీఎం చంద్రబాబు అధికారికంగా ఈ నివాసాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాయపూడిలో 12 టవర్లలో నిర్మించిన ఈ అత్యాధునిక ఫ్లాట్లను త్వరలోనే MLA, MLCలకు అధికారికంగా కేటాయించనున్నారు. దీంతో ఈ లగ్జరీ ఇళ్ల కోసం ప్రజాప్రతినిధులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సాకుతో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరించి, సభకు వెళ్లబోమని భీష్మించుకుని కూర్చున్న వైసీపీ నేతలు..ఇప్పుడు అమరావతిలోని ఆధునిక ఫ్లాట్ల కోసం మాత్రం ఆరాటపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ రాజధానినైతే కేవలం గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసి ఐదేళ్లు పక్కనపెట్టారో, తీరా ఇప్పుడు అదే రాజధానిలో ఇల్లు కావాలని ఉవ్విళ్లూరుతుండటం రాజకీయ వర్గాల్లో హాస్యాస్పదంగా మారింది.
ఒక్కోటి 3,500 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫ్లాట్లలో సకల సౌకర్యాలు ఉన్నాయి. బాల్కనీలు, ప్రత్యేక పార్కింగ్, క్లబ్ హౌస్, అత్యాధునిక భద్రతా సదుపాయాలతో వీటిని కార్పొరేట్ విల్లాలకు దీటుగా నిర్మించారు. ఇంతటి విలాసవంతమైన ఇళ్ల తాళాలు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ చేతిలో ఉన్నాయి. కేటాయింపులన్నీ జీఏడీ నిబంధనల ప్రకారం పక్కాగా జరగనున్నాయి. సభకే హాజరుకాని ప్రతిపక్ష సభ్యులకు ఈ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రజల పక్షాన పోరాడాల్సిన అసెంబ్లీని బహిష్కరించి, ప్రభుత్వ సౌకర్యాలు, విలాసాల కోసం మాత్రం మోజు పడటం వైసీపీ నైతికతను ప్రశ్నిస్తోంది. రాజధానిని వద్దన్న వాళ్లకే.. ఇప్పుడు అదే అమరావతిలో అడ్రస్ కావాల్సి రావడం గమనార్హం. సభకు రాకుండా ఫ్లాట్లు ఆశిస్తున్న వైసీపీ సభ్యుల వ్యవహారంలో జీఏడీ నిబంధనల అస్త్రంతో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, అసలు ఈ తాళాలు వారికి దక్కుతాయో లేదో త్వరలోనే తేలనుంది.
