ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్రెడాయ్ (CREDAI) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు స్వాగతించారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను కలిసి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.161పై అభినందనలు తెలిపారు.
భవన నిర్మాణ అనుమతుల నిబంధనల సరళీకరణతో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి లభించిందని క్రెడాయ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా జీవో నెం.161 ద్వారా అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణలు నిర్మాణ రంగ అభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
సెల్ఫ్ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం, సెట్బ్యాక్ నిబంధనలను సడలించడం వంటి నిర్ణయాలు భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు, నిర్మాణ రంగానికి ప్రయోజనకరంగా ఉంటాయని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. ఈ చర్యలతో అనుమతుల మంజూరులో జాప్యం తగ్గి పెట్టుబడులు, నిర్మాణ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి, రాజమండ్రిలో నిర్వహించనున్న ‘క్రెడాయ్ ఎక్స్పో’ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి నారాయణను క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మంత్రి సానుకూలంగా స్వీకరించినట్లు సమాచారం.
రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగాలకు అనుకూలమైన విధానాలు అమలు చేయడం ద్వారా పారదర్శకత, వేగవంతమైన అనుమతుల వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది.
