అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక అధ్యయన పర్యటనగా మంత్రి నారాయణ ఇవాళ్టి నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరారు. అధికారిక పర్యటనలో భాగంగా యూకే (బ్రిటన్) మరియు ఖతార్ దేశాలను మంత్రి సందర్శించనున్నారు.
మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGIC) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న పలు కీలక ప్రాజెక్టుల అభివృద్ధిపై అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది.
లండన్, దోహా నగరాల్లో అమలవుతున్న ఆధునిక అభివృద్ధి నమూనాలను మంత్రి బృందం పరిశీలించనుంది. అమరావతిలో టూరిజం ప్రాజెక్టులు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అనువైన ప్రణాళికలపై అక్కడి అనుభవాలను అధ్యయనం చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన పలు ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి, అభివృద్ధి విధానాలను తెలుసుకోనున్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో లండన్లో, 4, 5 తేదీల్లో దోహాలో మంత్రి బృందం పర్యటించనుంది. పర్యటన ముగిసిన అనంతరం ఈ నెల 5వ తేదీ రాత్రికి మంత్రి నారాయణ అమరావతికి తిరిగి చేరుకోనున్నారు.
