అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గత మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2025 మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ఏడాది క్రీడల్లో జిల్లా ఆర్మ్డ్ రిజర్వు విభాగం అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది.
క్రీడల్లో అత్యధిక పాయింట్లు సాధించి జిల్లా ఆర్మ్డ్ రిజర్వు జట్టు ‘ఓవరాల్ ఛాంపియన్’ ట్రోఫీని కైవసం చేసుకుంది. వివిధ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏఆర్ పిసి (AR PC 2379) ఈ. శ్రీను నాయక్ ‘ఇండివిడ్యువల్ ఛాంపియన్’గా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ‘టగ్ ఆఫ్ వార్’ (తాడు లాగుట) పోటీ పైనల్లో రాయచోటి సబ్ డివిజన్ – ఏఆర్ జట్టు పోటీ పడగా, ఏఆర్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. విజేతలను అభినందించిన డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ మాట్లాడుతూ, క్రీడలు పోలీసుల విధి నిర్వహణలో ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని తెలిపారు. మైదానంలో ప్రదర్శించిన పట్టుదల రేపు నేరాల నియంత్రణలోనూ చూపాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ, పోలీసు విధుల్లో ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ముగింపు సందర్భంగా నిర్వహించిన క్రీడాకారుల మార్చ్ పాస్ట్ అధికారులను ఆకట్టుకుంది. అనంతరం జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటాద్రి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పీ యం.ఆర్.కృష్ణమోహన్, మదనపల్లి డిఎస్పీ యస్ మహేంద్ర , సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు ఆర్ఎస్ఐలు, మరియు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
