మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A-7గా ఉన్న వైఎస్ భాస్కరరెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ కె.సుజన మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధించిన బెయిలు షరతులను సడలిస్తూ, నిబంధనలకు లోబడి ఏపీకి వెళ్లవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అయితే, ఈ పర్యటనకు సంబంధించి హైకోర్టు కొన్ని కఠినమైన షరతులను విధించింది. భాస్కరరెడ్డి ఏపీకి వెళ్లే 72 గంటల ముందే తన ప్రయాణ వివరాలు, అక్కడ ఉండే నివాస ప్రాంతం, తన ఫోన్ నంబర్లను CBI దర్యాప్తు అధికారికి , అలాగే సంబంధిత ప్రాంత SHOకు తెలియజేయాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోర్టు పేర్కొంది.
ఈ పర్యటన కేవలం వ్యక్తిగత కారణాల కోసమే ఉండాలని, వివేకా హత్య కేసుకు సంబంధించిన సాక్షులు ఉన్న ప్రాంతాలకు వెళ్లరాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో లేదా దానికి సంబంధించిన ఏ ఇతర వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకూడదని భాస్కరరెడ్డిని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే బెయిలుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కోర్టు సూచించింది.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా CBI తరఫున ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా, వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫున ఎస్. గౌతమ్ తమ వాదనలు వినిపించారు. భాస్కరరెడ్డికి బెయిలు షరతుల సడలింపు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సాక్షులను భయపెట్టే అవకాశం ఉందని వారు వాదించినప్పటికీ, హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
