కడప నగర శివారు ప్రాంతమైన సరోజినీ నగర్లోని టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, వాటిపై ఖర్చు చేసిన కోట్ల రూపాయల ప్రజాధనం మట్టిపాలైందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్సీపీ) రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన తన ప్రతినిధుల బృందంతో కలిసి టిడ్కో ఇళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, అగ్గిపెట్టల మాదిరిగా నిర్మించిన టిడ్కో ఇళ్ల పనులు అప్పట్లోనే వేగంగా పూర్తిచేసి అర్హులైన పేదలకు అప్పగించి ఉంటే ప్రజలకు ఉపయోగపడేవని అన్నారు. ఐదేళ్లకు పైగా ఖాళీగా ఉంచడం వల్ల ఇళ్లలోని తలుపులు, కిటికీలు ధ్వంసమైపోయాయని, రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కమ్మెలు పూర్తిగా తుప్పుపట్టిపోయాయని తెలిపారు.
ప్రస్తుతం ఈ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని, మద్యం, మత్తు పదార్థాల వినియోగానికి నిలయాలుగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లలో కనీస అవసరాలైన విద్యుత్తు, తాగునీరు, తలుపులు, అగ్నిప్రమాద నివారణకు నీటి సదుపాయాలు వంటి మౌలిక వసతులు ఏవీ లేవని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలని, టిడ్కో ఇళ్ల ప్రాంగణం మొత్తం ప్రహరీ గోడలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు కఠినంగా పర్యవేక్షించాలని, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే రవాణా సౌకర్యార్థం సిటీ బస్సులను నడపాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కోరుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు చాపల సుబ్బరాయుడు, మడగలం ప్రసాద్, రమేష్, రైతు నాయకులు ప్రతాప్రెడ్డి, మునిరెడ్డి, రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
