ప్రతీ ఒక్కరూ రోడ్ భద్రతా నియమాలను పాటించాలని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం విజ్ఙప్తి చేసారు. నగరంలోని రింగ్ రోడ్ పి.ఎస్.ఆర్. స్కూలులో యోగా సెంటర్లో యోగా భారత్ అధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఆందోళనలు, మానసిక ఒత్తిడి మధ్య ధ్యానం ఒక శక్తివంతమైన సాధనంగా నిలుస్తోందన్నారు. నిత్యం చేస్తున్న యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, భావోద్వేగ సమతుల్యమై, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందన్నారు.
విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు అందరికీ ధ్యానం సమానంగా ఉపయోగకరమని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించి, శాంతియుతమైన మరియు ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవరుచుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
ముఖ్యంగా మహిళలు, రిటైర్ అయిన వారిని, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది సైబరు నేరగాళ్ళు వాట్సాప్ కాల్స్ చేసి తమను డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదింరింపు కాల్స్ కు భయపడొద్దన్నారు. ఇటువంటి నేరగాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోనులు చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1930కు అందించాలన్నారు.
అలాగే రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కలిపిస్తున్నామని, నాణ్యత కలిగిన బి.ఐ.ఎస్. మార్క్ హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రక్షణ పొందాలని అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ఎస్పీ పోస్టర్ ను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో యోగా టీచర్ ఎస్.వి.కృష్ణారెడ్డి, జాతీయ స్వచ్చ భారత్ అవార్డు గ్రహీత ఎం.రామ్మోహన, ఉపాధ్యాయులు రవి, సత్యనారాయణ, జె.ఎన్.టి.యు. ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, డాక్టర్ రమణ, విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ సి.హెచ్.సురినాయుడు లు పాల్గొన్నారు.
