పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లేందుకు మే 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు “జెండా పండుగ” నిర్వహించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయి వరకు పెద్ద ఎత్తున పార్టీ జెండాలను ఆవిష్కరించాలని పార్టీ కార్యకర్తలకు ఆదేశించారు.
టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలు, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో టీఆర్ఎస్ జెండాలు ఎగురవేసి, పార్టీ లక్ష్యాలు, ఉద్యమ ఆత్మను ప్రజలకు వివరించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయ్యినా ప్రజలు ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన “నీళ్లు – నిధులు – నియామకాలు” అనే ప్రధాన హామీల అమలులో ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. వలస పాలన కాలంలో ఎదురైన దుష్పరిణామాలు మళ్లీ కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వస్తే జీవన పరిస్థితులు మెరుగుపడతాయని ఆశించిన ప్రతి వర్గం ఇప్పుడు అనిశ్చితిలో ఉందని కవిత అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఎలా పోరాడామో, ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం మరో ఉద్యమం అవసరమైందని స్పష్టం చేశారు.
తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేరిన నాయకత్వం, తెలంగాణ జాగృతి కార్యకర్తలు అందరూ కలిసి జెండా పండుగను విజయవంతం చేయాలని కోరారు.
