అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడితే ఎక్కడ అనర్హత వేటు పడుతుందోనన్న భయం ఇప్పుడు వైసీపీని వెంటాడుతోంది. ఒకవేళ వేటు పడి ఉప ఎన్నికలు వస్తే..కనీసం ఒక్క సీటు కూడా గెలవలేమనే టెన్షన్ జగన్ రెడ్డిలో మొదలైనట్లు కనిపిస్తోంది. అందుకే, ఇన్నాళ్లూ ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్లేదే లేదు అని భీష్మించుకు కూర్చున్న జగన్..ఇప్పుడు యూ టర్న్ తీసుకుని ఎమ్మెల్యేలను సభకు పంపాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బెంగళూరు వెళ్లేముందు ఎమ్మెల్యేలతో జరిపే భేటీలో దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
నిజానికి, ఒక్క జగన్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీకి వెళ్లాలని ఉంది. ప్రజలు తమను ఎన్నుకున్నదే సమస్యలపై మాట్లాడటానికని, ఇంట్లో కూర్చుంటే జనం తిట్టుకుంటారని ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. సభకు వెళ్లకపోవడం వల్ల ప్రజల్లో ఇప్పటికే నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఇదే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల నాటికి తమ గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అందుకే, అనర్హత వేటు గండం రాకముందే మేల్కొవాలని భావిస్తున్నారు.
ఈ గండం నుంచి గట్టెక్కేందుకు జగన్ను ఎలాగైనా ఒప్పించాలని ఎమ్మెల్యేలు ప్లాన్ చేశారు. జగన్ కూడా ప్రస్తుత పరిస్థితులను చూసి, తన పట్టు వీడి ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. సభలో అందరినీ కోఆర్డినేట్ చేసే బాధ్యతను సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారని సమాచారం. ఎమ్మెల్సీలు ఎలాగూ సభకు వెళ్తున్నారు కాబట్టి, ఎమ్మెల్యేలు కూడా అలాగే వెళ్లి ప్రభుత్వంపై పోరాడాలని జగన్ దిశానిర్దేశం చేసి, బెంగళూరు ఫ్లైట్ ఎక్కేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. జగన్ మనస్తత్వం ప్రకారం..అసెంబ్లీలో ఎవరైనా ఎమ్మెల్యే అదరగొట్టేసి, ప్రభుత్వంపై గట్టిగా ఫైట్ చేసి హీరో అయిపోతే ఆయన తట్టుకోలేరు. క్రెడిట్ అంతా తనకే రావాలనుకునే జగన్.. ఎమ్మెల్యేలు బాగా పేరు తెచ్చుకుంటున్నారని అనిపిస్తే, మళ్ళీ ఏదో వంకతో వారిని అడ్డుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి అనర్హత వేటు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి!
