జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున వరుస భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున 4:32 గంటల ప్రాంతంలో మొదటిసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఈ భారీ ప్రకంపనలు సంభవించిన కొద్దిసేపటికే, అదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రెండో ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా రికార్డయ్యింది.
అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని, సహాయక బృందాలు, స్థానిక యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని వారు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో తరచుగా ఇలాంటి ప్రకంపనలు వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
