బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లా త్రిశాల్ ఉపజిలాలో ఒక హిందూ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం, బోగర్ బజార్ కూడలిలో ఉన్న తన దుకాణంలోనే 62 ఏళ్ల సుసెన్ చంద్ర సర్కార్ను పదునైన ఆయుధంతో దుండగులు నరికి చంపారు.
అనంతరం ఆయనను దుకాణం లోపలే వదిలేసి షట్టర్లు మూసివేశారు. త్రిశాల్ పోలీస్ స్టేషన్ అధికారి మహ్మద్ ఫిరోజ్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం, సుసెన్ చంద్ర సర్కార్ ‘భాయ్ భాయ్ ఎంటర్ప్రైజ్’ అనే వ్యాపార సంస్థ యజమాని కాగా, దక్షిణకాండ గ్రామానికి చెందినవారు.
కుటుంబ సభ్యులు ఆయన కోసం వెతుకుతూ దుకాణం వద్దకు వచ్చి షట్టర్లు తెరిచినప్పుడు, రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను గుర్తించారు. వెంటనే మైమెన్సింగ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనలో దుండగులు దుకాణం నుంచి లక్షలాది టాకా నగదును దోచుకెళ్లినట్లు మృతుడి కుమారుడు సుజన్ సర్కార్ తెలిపారు. తమ కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, చాలాకాలంగా బియ్యం వ్యాపారం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తన తండ్రిని హత్య చేసిన నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ హత్య బంగ్లాదేశ్లో మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసలో తాజా ఘటనగా భావిస్తున్నారు. గతేడాది డిసెంబరులో తీవ్రవాద యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత హిందూ సమాజంపై దాడులు పెరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో హింస ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ గత నెలలో తెలిపింది. డిసెంబర్ 2025 ఒక్క నెలలోనే 51 మత హింస ఘటనలు నమోదైనట్లు ఆ సంస్థ పేర్కొంది.
ప్రధానమంత్రి షేక్ హసీనా గత ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల నేపథ్యంలో పదవీచ్యుతులైన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ ఎన్నికలు ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో నిర్వహించనున్నారు. 2022 జనగణన ప్రకారం బంగ్లాదేశ్లో హిందువుల జనాభా సుమారు 1.31 కోట్లుగా ఉండగా, ఇది దేశ మొత్తం జనాభాలో సుమారు 7.95 శాతం.
