ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు అల్లాడుతున్నాయి. దీంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గురువారం ఇరాన్ తన గల్ఫ్ అరబ్ పొరుగు దేశాల ఇంధన కేంద్రాలపై దాడులను తీవ్రతరం చేసింది.
ఇజ్రాయిల్ తన ప్రధాన నేచురల్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేసిన తర్వాత ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో భాగంగా, సౌదీ అరేబియాలోని రెడ్ సీ తీరంలోని యాన్బూ నగరంలో ఉన్న SAMREF రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది.
దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో ఖతార్లోని ప్రధాన ఎల్ఎన్జీ (ద్రవీభవించిన సహజ వాయువు) కేంద్రాలు క్షిపణి దాడులతో మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ, భారీ నష్టం వాటిల్లినట్లు ఖతార్ వెల్లడించింది. ఇప్పటికే ఉత్పత్తి నిలిపివేసిన ఈ కేంద్రాలకు మరింత నష్టం కలగడంతో గ్లోబల్ మార్కెట్లకు సరఫరా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
కువైట్లోని మినా అల్-అహ్మది రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. రోజుకు సుమారు 7.3 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ రిఫైనరీ మధ్యప్రాచ్యంలో అతిపెద్ద వాటిలో ఒకటి. వెంటనే సమీపంలోని మినా అబ్దుల్లా రిఫైనరీలో కూడా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీర ప్రాంతంలో ఒక నౌకకు మంటలు అంటుకోగా, మరో నౌకకు ఖతార్ సమీపంలో నష్టం వాటిల్లింది. హోర్మోజ్ జల సంధిపై ఇరాన్ ప్రభావం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా కూడా ప్రమాదంలో పడింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారా జరుగుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని తప్పించేందుకు చమురును పశ్చిమ దిశగా పంపించి రెడ్ సీ మార్గంలో రవాణా చేయడం ప్రారంభించింది. అయితే యాన్బూ రిఫైనరీపై జరిగిన తాజా దాడితో ఆ మార్గం భద్రతపై కూడా అనుమానాలు తలెత్తాయి.
ఇక అబూదాబీలోని హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ మరియు బాబ్ ఆయిల్ ఫీల్డ్లపై జరిగిన దాడుల నేపథ్యంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులను “ప్రమాదకరమైన ఉద్రిక్తత పెరుగుదల”గా అభివర్ణించారు. ఈ పరిణామాల వల్ల ప్రపంచ ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.
