పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత తో పాటు పనుల వేగం పై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఎం ఎల్ కాంతారావు సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి క్షణం విలువైనదని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని పనులు చేయాలన్నారు.
బుధవారం ఆయన పోలవరం ప్రాజెక్ట్ సి ఈ ఓ యోగేష్ పైతాన్కర్ , నూతన సి ఈ ఓ గా నియమితులైన సంజీవ్ వోహ్రా, పీ పీ ఏ చీఫ్ ఇంజనీర్ కే రమేష్ తో కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పీ పీ ఏ అధికారులు, ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇక ముందు జరగాల్సిన పనులు, వాటికి సంబంధించిన ప్రణాళిక, ఎదురైతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమీక్షించారు. సుమారు ఐదు గంటలపాటు ఆయన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో గడిపారు.
పోలవరం ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో అలా పూర్తి చేయటానికి రూపొందించుకున్న ప్రణాళిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ లో పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక ముందు కూడా అదే విధమైన ప్రణాళికతో పనులు చేయాలని కోరారు. ఇప్పటి వరకు ప్రతి క్షణం విలువైనదే, ఇక ముందు ఒక్క క్షణం వృధా అయినా దాని ప్రభావం ప్రాజెక్ట్ నిర్మాణం పై పడుతుంది, నిర్దేశించిన లక్ష్యాలు చేరలేరు అని అన్నారు. జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రతి రోజూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకుని పని చేయాలని సూచించారు.
ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఆకృతులకు అనుమతులు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయం హైదరాబాద్ లో ఉండటం వల్ల కొంత సమన్వలోపం ఉందని, ఇక నుంచి ఆ కార్యాలయం రాజమహేంద్రవరం నుంచి పని చేస్తున్నందున ప్రతి రోజు ఏ సమస్య ఉన్న వెంటనే సమావేశమై పరిష్కరించుకోవాలి అని చెప్పారు.
త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్నింటితో తానూ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసం, భూసేకరణ గురించి కూడా తెలిపారు.
ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని కలియ తిరిగిన కాంతారావు బట్రస్ డ్యామ్ వద్ద పరిశీలన చేశారు. అక్కడి నుంచి ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, 2, డి హిల్, జి హిల్ మొదలైన వాటిని పరిశీలించారు. వాటిని పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువును అడిగి తెలుసుకున్నారు.
పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సమాంతరంగా జల విద్యుత్ కేంద్రం పనులు జరుగుతున్నాయని, 2028 జనవరి నాటికి అన్ని యూనిట్ల నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు వివరించారు.
కేంద్ర జలవనరుల కార్యదర్శి కాంతారావు పర్యటన, అనంతరం సమీక్షలో ఆంధ్ర ప్రదేశ్ జల వనరుల శాఖ కార్యదర్శి ఎం.వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, సీఈ రామచంద్ర రావు, ఎం ఈ ఈ ఎల్ ప్రతినిధులు అంగర సతీష్ బాబు, ఏ గంగాధర్, మురళి పమ్మి, ఏ పీ జెన్కో, వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
