తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు జోగి రమేష్, రోజా మధ్య జరిగిన ఒక ఆసక్తికర చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
తిరుమల పవిత్రతకు సంబంధించిన ఈ విషయంలో తాము తప్పు చేసి దొరికిపోయామని రోజా వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి విషయంలో తాము తప్పు చేసి దొరికిపోయామని ఇది జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని జోగి రమేష్ అన్నారు.దేవుడి విషయంలో పెద్ద తప్పు జరిగిపోయిందనే ఆందోళన వారి మాటల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
బయటకు గంభీరంగా కనిపిస్తూ, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతున్నప్పటికీ, లోలోపల మాత్రం ఒక రకమైన భయం తమను వెంటాడుతోందని వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా “యేడుకొండల వాడితో పెట్టుకున్నాం, ఆయన ఏ రూపంలో శిక్షిస్తాడో.. ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో” అని రోజా అన్నారు.
అది కరెక్ట్ అని జోగి రమేష్ అన్నారు. వారు ఒకరితో ఒకరు ఆవేదన పంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా భయం లేదని, కానీ సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనన్న ఆందోళన ఇప్పుడు వారిని కలవరపెడుతోంది.
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత కంటే, దైవాపచారం జరిగిందన్న భావన వారిలో మానసిక ఒత్తిడిని పెంచుతున్నట్లు ఈ సంభాషణల సారాంశం.
