విశాఖపట్నం నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టిన పోలీసులు, ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకువచ్చారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పీడ్ లేజర్ గన్స్ను ప్రవేశపెట్టారు. ఒక్కో పరికరం సుమారు రూ.18 లక్షల విలువ కలిగి ఉండగా, రెండు స్పీడ్ గన్స్ను విశాఖ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగానికి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ ఆధునిక పరికరాలను సిఎస్ఆర్ నిధుల ద్వారా జివిఎంసి మరియు అమృత టెక్నాలజీ సంస్థలు సమకూర్చాయి. ఈ స్పీడ్ గన్స్ సహాయంతో ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ వేలో ప్రయాణించే వాహనాలను గుర్తించి వీడియో, ఫోటో ఆధారాలతో రికార్డ్ చేసి ఆటోమేటిక్గా చలాన్లు జారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు.
ఈ పరికరాలను పోలీస్ కమిషనరేట్కు కేతన్ గార్గ్ అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బగ్చి మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ స్పీడ్ గన్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నగరంలోని ఒక ముఖ్య ప్రాంతంలో, అలాగే జాతీయ రహదారిపై మరో స్పీడ్ గన్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
భవిష్యత్తులో మరిన్ని పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు. జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ నెలరోజుల వ్యవధిలోనే ఈ స్పీడ్ గన్స్ను సమకూర్చామని తెలిపారు. విశాఖ నగరంలో ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రమాదాల నివారణ కోసం జిల్లా కలెక్టర్, ఎంపీ, సిటీ పోలీస్ కమిషనర్లతో కూడిన కమిటీ పనిచేస్తోందని, ట్రాఫిక్ సమస్యలు లేని సురక్షిత విశాఖ నగరాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
