తల్లి ఆశీర్వాదం ఉంటే.. ప్రకృతి కూడా తోడవుతుంది. ధర్మం వైపు పోరాటం ఉంటే.. దేశమే కదిలివస్తుంది. నేడు భారత లోక్సభ సాక్షిగా అదే జరిగింది! ఐదేళ్ల అణచివేత, వేల రోజుల కన్నీటి పర్యంతం, ముళ్ల కంచెలు, పోలీసు బూట్ల చప్పుడు.. వీటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ‘అమరావతి’ అనే అక్షరం నేడు భారత పార్లమెంటు రికార్డుల్లో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది.
ప్రస్తుత 18వ లోక్సభ ఒక ప్రజాస్వామ్య యుద్ధభూమి. 41 రాజకీయ పక్షాలు.. ఎన్నో భిన్న అభిప్రాయాలు! కానీ, ఆంధ్రుల ఆత్మాభిమానం ‘అమరావతి’ బిల్లు ముందుకు రాగానే, ఆ 41 పార్టీల్లోని 40 పార్టీలు తమ జెండాలను పక్కనపెట్టాయి. ఒకే ఒక్క ‘ఎజెండా’తో ముందుకు వచ్చాయి.. అదే ‘అమరావతి అభివృద్ధి’.
ఎన్డీఏ కూటమిలోని 17 పార్టీలు గర్వంగా నినదించాయి.
ఇండియా కూటమిలోని 18 పార్టీలు ఆకాంక్షను గౌరవించాయి.
స్వతంత్రులు, ఇతర 5 పార్టీలు సైతం రాజధాని రైతు త్యాగానికి సెల్యూట్ చేశాయి.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు.. భారత ప్రజాస్వామ్య గొంతుకలన్నీ ఏకగ్రీవంగా “అమరావతి – ఆంధ్రుల ఏకైక రాజధాని” అని ముక్తకంఠంతో చాటిచెప్పాయి.
ఒంటరైన విద్వేషం.. పారిపోయిన ఏకైక పార్టీ!
సముద్రమంత మద్దతు ఉన్న చోట.. ఒక చిన్న విద్వేషపు చుక్క ఎంతటి అపహాస్యానికి గురవుతుందో నేడు లోక్సభలో అర్థమైంది. 41 పార్టీల ఈ మహా సభలో, కేవలం వైకాపా మాత్రమే ఆంధ్రుల కలలకు అడ్డుపడింది. 11 పార్టీలు చర్చలో పాల్గొంటే, వీరు మాత్రం తమ వంతు విషం కక్కి, మొహం చాటేసి, ప్రజల ఆకాంక్షను తృణీకరించి, సభను బహిష్కరించి పరారయ్యారు.
రాష్ట్ర ప్రయోజనాల కంటే అహంకారమే మిన్న అనుకున్న ఆ పార్టీ వైఖరి, నేడు దేశం ముందు నవ్వులపాలైంది. ఒకే ఒక్క పార్టీ వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్లిపోయినా, 40 పార్టీల ఆశీర్వాదం అమరావతికి రక్షణ కవచంలా నిలిచింది.
ఇది కేవలం ఒక బిల్లు విజయం కాదు.. ఇది 33 వేల ఎకరాల భూమిని నమ్మిచ్చిన ఆ అమరావతి రైతుల ఆత్మగౌరవ విజయం! ఎర్రటి ఎండలో రోడ్డెక్కిన తల్లుల పోరాటానికి దక్కిన గౌరవం. ఆనాడు కన్నీళ్లు తుడిచే నాథుడు లేకపోయినా, ఈనాడు భారత పార్లమెంటే సాష్టాంగ నమస్కారం చేసింది.
“నాడు నేల తల్లికి ఇచ్చిన మాట.. నేడు పార్లమెంటు చేసిన చట్టం.. రేపటి తరాల భవిష్యత్తుకు మార్గం!”
అమరావతి ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర రాజధాని కాదు.. అది ‘భరతమాత ముద్దుగా అమరావతి అని ప్రత్యేకంగా పిలిచిన ప్రజా రాజధాని’. విద్వేషం ఓడింది.. విశ్వాసం గెలిచింది. 40 పక్షాల ఆశీస్సులతో ఆంధ్రుడి ఆశయం సిద్ధించింది. చీకటి రోజులు ముగిశాయి.. అమరావతి పునర్వైభవం ఇక ఆగదు.. ఆపలేరు!
