అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం తెలుగు ప్రజలకే గాక యావత్ భారతీయులకు ఆరాధ్యుడని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. అమరజీవి ఆత్మత్యాగంతో కేవలం తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంతో పాటూ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు.
గుజరాతీ, బెంగాళీ వంటి భాషల ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు పోరాటమే కారణమన్నారు. యావత్ ప్రజలు చిరకాలం గుర్తించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ విగ్రహాన్ని రాజధాని అమరావతిలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిందన్నారు.
పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తదితరులు పాల్గొన్నారు.
