బడి గుడి తో సమానమని ప్రతి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం పులిపలుపుల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు.
గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో చదివి 10వ తరగతిలో ప్రధమ, ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి వరుసగా 15 వేలు, 10 వేలు, 7500 రూపాయల ప్రోత్సాహకం అందించమని, ఈ విద్యా సంవత్సరానికి ఈ ప్రోత్సాహకాన్ని పెంచుతున్నామని అన్నారు. ఈసారి పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి 25 వేలు, 15 వేలు, 10 వేల రూపాయలు అందిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, సమూల మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బాగా విద్య వ్యవస్థ పైన ఫోకస్ చేస్తున్నాడన్నారు. ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి వెళ్ళినవారందరు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లేనని, ప్రభుత్వ పాఠశాలలో చదువు గొప్పగా ఉంటుందని తన అభిప్రాయాన్ని చెప్పారు.
మనం మన కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తామో సమాజంలో ఉన్న పేద వాళ్ళ గురించి గ్రామం గురించి ప్రాంతం గురించి ఆలోచించినప్పుడే ప్రభుత్వ బడులు ప్రాంతం అభివృద్ధి చెందుతాయని, మా అమ్మ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద నేను బ్రతికున్నంత వరకు పేదలకు ఆర్థిక సహాయం చేస్తానన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు కొట్లాడి మరి తీసుకొచ్చింది ఉదయ సముద్రం బ్రాహ్మణవెళ్లెంల ప్రాజెక్టు అని, 90 శాతం పూర్తయిన ఆ ప్రాజెక్టును కావాలని 10 సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిందని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 10 శాతం పనులని పూర్తి చేసి భూ సేకరణ ఆర్ అండ్ ఆర్ పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తీసుకొచ్చి పంపులను ఓపెన్ చేశామని గుర్తు చేశారు.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కడి నుండి నీటిని తీసుకురావాలో అనే అంశాన్ని వదిలిపెట్టి కేవలం కమిషన్ల కోసమే టిఆర్ఎస్ పార్టీ రిజర్వాయర్ లు కట్టి వదిలిపెడితే, మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఏదుల రిజర్వాయర్ నుండి నీటిని తరలించడానికి 1800 కోట్ల రూపాయలను మంజూరు చేయించానని ఆ పనులు మొదలయ్యాయని అన్నారు.
బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు నుండి మునుగోడు మండలంలోని గ్రామాలకు శాశ్వతంగా సాగునీరు తాగునీరు అందించడానికి భూసేకరణ పనులు జరుగుతున్నాయన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిస్వార్ధంగా నిజాయితీగా పని చేస్తున్నానని.. ఇటీవల కొంతమంది తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారని రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవాలి రాజకీయాలు లేనప్పుడు అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాలని అన్నారు.
మునుగోడు నియోజకవర్గం లో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు 31 సబ్ స్టేషన్లు నిర్మాణం అయితే మా ప్రజా ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాలలోనే 24 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని, ప్రస్తుతానికి 132 కెవి సబ్ స్టేషన్ లు మూడు ఉండగా మరో మూడు 132 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేయించాను అన్నారు. రాబోయే 25 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని మునుగోడు నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్య లేకుండా చూడడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు.
