కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పులపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20,000 ఎకరాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కొల్లేరు సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీకి లేఖ పంపింది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డెలైఫ్ (ఎన్బీడబ్ల్యూఎల్) స్టాండింగ్ కమిటీ 48వ సమావేశం చేసిన సిఫార్సులను అమలు చేయాలని కోరింది.
సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతతోపాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నట్లు లేఖలో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) అనుమతి కోరాలని తీర్మానించారు.
ఈ నేపథ్యంలోనే 2018 నుంచి సరిహద్దుల మార్పుపై ఉన్న స్టే ఎత్తివేసి, తదుపరి చర్యలకు అనుమతి ఇవ్వాలని సీఈసీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే లేఖ రాశారు.
