భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ అభివృద్ధి పనుల మొదటి దశకు నేడు అంకురార్పణ జరిగింది. ఈ చారిత్రక ఘట్టంలో భాగంగా ఆలయ జీర్ణోద్ధరణ, కళావాహన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ విశేష పూజా కార్యక్రమాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు పాల్గొని, పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 351 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయగా, అందులో మొదటి విడతగా 180 కోట్ల రూపాయలతో నేడు పనులను ప్రారంభించారు. ఈ పనుల నేపథ్యంలో ఆలయం చుట్టూ ఉన్న దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక క్రతువుల కారణంగా మధ్యాహ్నం వరకు భక్తులకు స్వామివారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రాద్రి రామాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చేపట్టిన ఈ పునర్నిర్మాణ పనులతో భక్తులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
