తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలు స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రతి నియోజకవర్గానికి 1000 మంది చొప్పున లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను పంపిణీ చేయాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకం అమలుపై సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాల మహిళలను స్వయం సమృద్ధి గల పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు మహిళల్లో ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ రంగంలో వ్యాపార అవకాశాలను విస్తరించుకోవడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని ఆయన వెల్లడించారు.
త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు, స్కిల్ డెవలప్మెంట్ (నైపుణ్యాభివృద్ధి) కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మంత్రి వివరించారు.
