బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.
