అనారోగ్యంతో డ్యూటీ చేయలేని ఆర్టీసీ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనారోగ్య కారణాలతో డ్రైవర్లు, ఇతర ఎంప్లాయీస్ మెడికల్లీ అన్ఫిట్ అని తేలితే వారికి ఇతర విభాగాల్లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆర్టీసీలో ఉన్న సమయంలో డ్రైవర్లకు ఈ వెసులుబాటు ఉండేది. కానీ ప్రభుత్వ ఉద్యోగులగా మారిన తర్వాత.. ఇతర డిపార్ట్మెంట్లలో ఇలాంటి రూల్ లేకపోవడంతో.. ఆర్టీసీ ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు జాబ్ రోల్ మార్చుకొనే అవకాశం లేకుండా పోయింది.
ప్రజా రవాణా ఉద్యోగుల సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం.. ఆర్టీసీలోని డ్రైవర్లు.. ఇతర ఉద్యోగులకు గతంలో ఉన్న వెసులుబాటును కల్పించాలని నిర్ణయించింది. 21 రకాల వ్యాధుల కారణంగా డ్యూటీకి అన్ఫిట్ అని తేలిన డ్రైవర్లు.. ఇతర ఉద్యోగులకు.. కండక్టర్లు.. అసిస్టెంట్ మెకానిక్ వంటి పోస్టుల్లో అవకాశం కల్పిస్తారు. ఈ పోస్టులు ఖాళీ లేకపోతే.. జిల్లా కలెక్టర్కి వీరి వివరాలు పంపించి.. ఇతర శాఖల్లో ఉద్యోగం కల్పిస్తారు. మెడికల్లీ అన్ఫిట్ అని తేలిన తర్వాత ఇతర ఉద్యోగాలకు మారేందుకు ఇష్టపడకపోతే.. అలాంటి వారికి పరిహారం చెల్లిస్తారు. 2020 జనవరి నుంచి వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగుల భద్రత, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని తెలిపారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి. ఉద్యోగులెవరు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబు, రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఛైర్మన్లకు ఎంప్లాయీస్ యూనియన్లు ధన్యవాదాలు తెలిపాయి.
