‘తలసేమియా వ్యాధి’ అనేది జన్యుపరంగా వస్తుంది.తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే తీవ్రమైన రక్తహీనత వ్యాధి ‘తలసేమియా’. మన శరీరంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం రక్తంలో ఆక్సిజన్ను తీసుకెళ్లే పని చేస్తుంది. కానీ తలసేమియా ఉన్నవారిలో ఈ హీమోగ్లోబిన్ సరైన రీతిలో తయారు కాదు. దీంతో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఫలితంగా తీవ్రమైన రక్తహీనత ఏర్పడుతుంది. ఈ అంశంపై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాటల్లోనే….
ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. తల్లిదండ్రులిద్దరూ క్యారియర్లు (జన్యువాహకులు) అయితే, పుట్టబోయే బిడ్డకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తల్లిదండ్రులలో ఎవరికైనా తలసేమియా జీన్స్ ఉండటం, తెలియకుండా క్యారియర్ల మధ్య వివాహం జరగడం, ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం,కుటుంబంలో రక్త సంబంధిత వ్యాధుల చరిత్ర ఉండటం. ఈ కారణాల వల్ల ‘తలసేమియా వ్యాధి’ పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
‘తలసేమియా వ్యాధి’ ని పూర్తిగా నివారించలేము కానీ ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నియంత్రించవచ్చు.వివాహానికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం,గర్భధారణ సమయంలో స్క్రీనింగ్ చేయించడం,కుటుంబ సభ్యుల్లో అవగాహన పెంచడం,సమాజంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తే కొంతవరకు ఈ వ్యాధికి సంబంధించిన కేసులను తగ్గించవచ్చు.
‘తలసేమియా వ్యాధి’కిపూర్తిగా సులభమైన మందు లేదు. కానీ కొన్ని చికిత్సలు ఉన్నాయి..✯రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ (రక్త మార్పిడి) ✯ఐరన్ స్థాయిని నియంత్రించే మందులు ✯సరైన వైద్య పర్యవేక్షణ ✯కొన్నిసార్లు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ (Bone Marrow Transplant) ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది ఖరీదైన చికిత్స కావడంతో అవగాహన నివారణ చాలా ముఖ్యమైనవి.
ప్రజల్లో అవగాహనే తలసేమియా వ్యాధిపై అసలైన ఆయుధం
ఈ వ్యాధి గురించి ప్రభుత్వం మాత్రమే కాదు, మనమంతా కలిసి పని చేయాలి.ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు రావాలి . అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలి. పరీక్షలు చేయించుకోవాలని ఇతరులకు చెప్పాలి.తలసేమియా పిల్లలకు మానసికంగా మద్దతు ఇవ్వాలి.మనం చేసే చిన్న సహాయం చిన్నారుల జీవితాన్ని కాపాడగలదు.
ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్పదలచుకున్నాను.. తలసేమియా ఒక భయంకరమైన అంటువ్యాధి కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యగా మారుతుంది. అందరూ ‘తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచాలి..చైతన్యం తీసుకురావాలి.మార్పు రావాలి. తలసేమియా వ్యాధిని నివారించాలి.
అందుకే ఈరోజు మనం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K | 5K | 10 ‘తలసేమియా రన్’ లో పాల్గొన్నాం “నిరోధమే ఉత్తమ చికిత్స” అనే మాటను మనం గుర్తుంచుకోవాలి.మనం ముందుగా పరీక్షలు చేయించుకుంటే, సరైన అవగాహన కలిగి ఉంటే, తలసేమియా లేని సమాజాన్ని నిర్మించగలం.ఆరోగ్యమైన సమాజం కోసం మనమంతా కలిసి కృషి చేద్దాం.
