పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిశారు. ఈ సందర్భంగా మన ప్రాంత రైల్వే వ్యవస్థలో మార్పులు తీసుకురాగల మూడు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాలను మంత్రికి సమర్పించారు.
1.పిడుగురాళ్ల – రామాయపట్నం కొత్త రైల్వే లైన్
పల్నాడు ప్రాంతంలోని సిమెంట్, సున్నపురాయి, వ్యవసాయ మరియు లాజిస్టిక్స్ రంగాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే రామాయపట్నం పోర్టుతో అనుసంధానం అత్యంత కీలకమని ఎంపీ వివరించారు. ఇందుకోసం కొత్త రైల్వే లైన్ నిర్మించాలని కోరారు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
2.విజయవాడ – బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్
పల్నాడు జిల్లా నుండి నిత్యం వేలాది మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు బెంగళూరుకు ప్రయాణిస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణ సమయాన్ని తగ్గించి అత్యున్నత సౌకర్యాలు అందించేలా వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని కోరారు.
3.నడికుడి, పిడుగురాళ్లలో సూపర్ఫాస్ట్ రైళ్ల స్టాపేజ్ …
ప్రజల సౌకర్యార్థం సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ (20701) మరియు లింగంపల్లి – విజయవాడ ఎక్స్ప్రెస్ (12796) రైళ్లను నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని, పల్నాడు ప్రాంత రైల్వే అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ లావు వెల్లడించారు.
