పల్నాడు జిల్లాలో అనుమతులు లేని అనధికార భవన నిర్మాణాలు మరియు అక్రమ లే-అవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఆర్డీవోలు, డిపిఓ, డిఎల్ డివోలు, ఎంపీడీవోలు మరియు పంచాయతీ కార్యదర్శులతో అక్రమ లే-అవుట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జీ కలెక్టర్ మాట్లాడుతూ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం-2016 ప్రకారం అనధికార లే-అవుట్లను గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పంచాయతీ కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలని అన్నారు.
ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్ నంబర్ 5 ద్వారా స్థానిక సంస్థలకు ఈ చట్టంలోని పలు సెక్షన్ల కింద ప్రత్యేక అధికారాలను కల్పించిందని, దీనిని ఉపయోగించుకొని నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పనులను నిలుపుదల చేయడం, సీలింగ్ మరియు కూల్చివేత ఉత్తర్వులు జారీ చేయడంలో వెనకాడకూడదని స్పష్టం చేశారు.
ఆమోదించబడిన ప్లాన్లకు భిన్నంగా నిర్మాణాలు చేపడుతున్న వారిని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. కేవలం చర్యలు తీసుకోవడమే కాకుండా పౌరులు ఏదైనా స్థలం లేదా భవనం కొనుగోలు చేసే ముందే సంబంధిత అనుమతులను సరిచూసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
శాఖల మధ్య సమన్వయం మరియు పటిష్టమైన పర్యవేక్షణ ద్వారానే అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేయగలమని, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించి ప్రజలకు మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీవోలు పి. బాలకృష్ణ, శ్రీరాములు, మురళీకృష్ణ, డి.ఎల్.డి.వోలు వెంకట్ రెడ్డి, గబ్రూ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
