చైనాలో సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆంక్షలు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, న్యాయం, విద్య వంటి కీలక రంగాల్లో అనర్హులైన వ్యక్తులు తప్పుదోవ పట్టించే సమాచారం అందించకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది.
సంబంధిత రంగాల్లో కంటెంట్ రూపొందించాలంటే తప్పనిసరిగా విద్యార్హతలు లేదా ధృవపత్రాలు ఉండాలని కొన్ని వేదికలకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీని ప్రభావంగా ఫిట్నెస్ నిపుణులుగా తమను ప్రకటించుకునే వారు, స్టాక్ మార్కెట్ గురువులుగా చెప్పుకునే వారు, వైద్య సలహాలు ఇస్తున్న పాడ్కాస్ట్ నిర్వాహకులు, వెల్నెస్ కోచ్లుగా వ్యవహరించే వారు వంటి అనేక ఖాతాలు పరిశీలనకు లోనవుతున్నాయి.
అర్హతలు లేని వారు తప్పుదోవ పట్టించే సమాచారం ఇస్తే వారి కంటెంట్ తొలగించడం లేదా ఖాతాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఒక కీలక చర్చకు దారితీస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో ప్రభావం అనేది కేవలం ఆలోచనలు, అనుభవాల ఆధారంగా రావాలా, లేకపోతే విద్యార్హతలు, అధికారిక ప్రమాణాలు ఉండాలా అన్న ప్రశ్న ముందుకు వచ్చింది. డిజిటల్ వేదికల భవిష్యత్తులో ఈ అంశం మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇది మొత్తం సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లను ఒకేసారి నిషేధించడమనే చర్య కాదని, నియంత్రణల భాగంగా దశలవారీగా అమలు జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు సరైన, విశ్వసనీయ సమాచారం అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
