శనివారం మధ్యాహ్నానానికి పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించనున్నది. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభవుతుంది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంటుంది. అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంటుంది. హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్ధిని, రుద్రాక్షమఠం, విభూతి మఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంటుంది.
రుద్రవనం నుంచి నందిమండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.
శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహించడం జరుగుతోంది.
కైలాసంగా ప్రసిద్ధమైన శ్రీశైలమహాక్షేత్రములో గిరిప్రదక్షిణ చేయడం ఎంతో ఫలప్రదం. కావున యాత్రికులు మరియు స్థానికులు ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమములో పాల్గొనవలసినదిగా కోరడమైనది.
