హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు చేపట్టనున్న స్పెషల్ మాన్సూన్ డ్రైవ్లో భాగంగా దోమల నివారణకు చేపట్టనున్న చర్యలపై మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా IEC కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంటమాలజీ విభాగం అధికారులు దోమల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్కు వివరించారు. దోమల నివారణకు ఉపయోగిస్తున్న వివిధ పరికరాలను మంత్రి పరిశీలించి, వాటి వినియోగం, పనితీరు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దోమల నివారణకు విస్తృత చర్యలు
దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు.
ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం నిర్వహించడం.
ఇంటింటికీ వెళ్లి నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించడం.
దోమల లార్వాలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్స్ నిర్వహించడం.
జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా ఫాగింగ్ నిర్వహించడం.
దోమల నివారణపై కరపత్రాలను పంపిణీ చేయడం.
పాఠశాలల్లో విద్యార్థులకు దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నిల్వ ఉన్న నీటిని తొలగించేలా ప్రజలకు సూచనలు చేయడం.
హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ వెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ప్రజలందరూ స్వీయ బాధ్యతతో తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమంలో భాగంగా ఇళ్లలో, పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల లార్వాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
డెంగ్యూ వంటి వ్యాధులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని మంత్రి అన్నారు.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే హైదరాబాద్ ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని మంత్రి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ చేస్తున్న విజ్ఞప్తిని ప్రతి ఒక్కరూ పాటించి దోమల నివారణలో భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి IEC (Information, Education and Communication) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. అమర్ సింగ్ నాయక్ తెలిపారు. దోమలను ఎలా నియంత్రించాలి, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్గున్యా వంటి వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం ద్వారా దోమల లార్వాలను గుర్తించి, అవి పెరిగే అవకాశం ఉన్న నీటి నిల్వలను తొలగించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అక్కడక్కడా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను ప్రజలు వెంటనే గుర్తించి తొలగించాలని కోరారు. ఇళ్ల పరిసరాల్లో దోమల లార్వాలు కనిపిస్తే వాటిని గుర్తించి, ఆ నీటిని బయటకు పారబోయాలని సూచించారు.
