కూటమి ప్రభుత్వానికి రైతులే తొలి ప్రాధాన్యం. రైతుల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి పాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం. గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా బకాయి పెట్టిన రూ.1674 కోట్లను రెండు విడతల్లో చెల్లించాం. ధాన్యం అమ్మిన సొమ్ములు 24 గంటల్లోపే వారి ఖాతాలో జమ అయ్యేలా చొరవ తీసుకున్నాం.
సాంకేతికతను రైతు ముంగిట్లోకి తీసుకొచ్చి, ధాన్యం సేకరణ చేయించాం. రూ.50 కోట్లతో వర్షాల కోసం టార్పాలిన్లు కొని రైతులకు అందజేశాం. రైతు ప్రయోజనమే ముఖ్యంగా పాలనలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
రెండేళ్ల కూటమి పాలన, పౌర సరఫరాల శాఖ ద్వారా తీసుకొచ్చిన సంస్కరణలు వివరించేందుకు సోమవారం మంత్రి సచివాలయంలోని 4వ బ్లాక్ లోని మీడియా బ్లాక్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘‘ రెండేళ్లలో 1.29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 17.97 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. ఇది రికార్డు.
ఎన్నో ప్రతికూలతలు పకలరించినా, దాన్ని సంకల్పం అనే ఆయుధంతో అధిగమించి అనుకూలతలుగా మార్చుకున్నాం. కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వానికి అమ్మితే, ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి గతంలో రైతులకు ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి, 24 గంటల్లోనే ధాన్యం అమ్మిన డబ్బుల 94 శాతం మంది రైతులకు వారి ఖాతాలో జమ అయ్యే ఏర్పుటు చేశాం. 48 గంటల్లో 100 శాతం జమ అయ్యేలా చూశాం.
దేశంలోనే ధీటైన సంస్కరణలు
రైతులకు మేలు చేసేలా, పాలనలో సరికొత్త సంస్కరణలను ఈ రెండేళ్లలో తీసుకొచ్చాం. వాట్సప్ సాంకేతికతను 44,081 మంది రైతులు వాట్సప్ ద్వారా ధాన్యం అమ్మే షెడ్యూలు చేసుకున్నారు. దీనిద్వారా 3,51,431 మెట్రిక్ టన్నులను రైసు మిల్లులకు తరలించాం. దేశంలో ఎన్నడూ లేనట్లుగా ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డును ప్రత్యేక క్యూఆర్ కోడ్ తో రాష్ట్రంలోని 1,49,22,066 కుటుంబాలకు అందించాం. సీఎంఆర్ ధాన్యం సేకరణలో 10.45 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించి, దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాం.
రాజకీయాలకు అతీతంగా నిబద్ధతగా పాలన
రాజకీయాలకు అతీతంగా దీపం-2 పథకాన్ని లబ్దిదారులకు అందించాం. నాలుగు విడతలుగా అమలు చేసిన పథకంలో మొదటి విడతలో 96.29 లక్షల సిలిండర్లు, రూ.764 కోట్ల రాయితీ, రెండో విడతలో 92.80 లక్షల సిలిండర్లు, రూ.777 కోట్ల రాయితీ, మూడో విడతలో 93.81 లక్షల సిలిండర్లు, రూ.791 కోట్ల రాయతీ, నాలుగో విడతలో 92.28 లక్షల సిలిండర్లు, రూ.760 కోట్ల రాయతీని అందించాం.
5వ విడతలోనూ ఇప్పటివరకు రూ.300 కోట్ల రాయితీ సొమ్ములను ఆయిల్ కంపెనీలకు అందించాం. బడి పిల్లలకు శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో 2.25 లక్షల మెట్రిక్ టన్నుల సూపర్ ఫైన్ బియ్యంతో వారికి భోజనం అందించాం. రైతులు కూడా బోనస్ ఆశించకుండా సూపర్ ఫైన్ రైస్ ను పిల్లల కోసం అందించారు.
రేషన్ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం
భవిష్యత్తులో రేషన్ డిపోల ద్వారా లబ్దిదారులకు అందించే బియ్యం నాణ్యమైనవి అందించాలని భావిస్తున్నాం. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. మా ప్రణాళికను ఇప్పటికే కేంద్రం ముందు పెట్టాం. అక్కడి నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. రేషన్ అక్రమ రవాణాను పూర్తిగా ఆపాలంటే, ప్రజలు రేషన్ బియ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.
దీంతో పాటు అక్రమ రవాణాను నిరోధించడానికి ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ లను వినియోగిస్తాం. దీంతో పాటు ప్రత్యేకంగా హోల్ సేల్ దుకాణాలకు దీటుగా మినీ మార్టుల ఏర్పాటు చేయనున్నాం. ఇక్కడ మంచి డిస్కౌంట్ తో బియ్యం, చిరుధాన్యాలు, తృణధాన్యాలు ప్రజలకు లభించే ఏర్పాటు చేస్తాం. రాబోయే కాలంలో గుజరాత్, పాండిచ్చేరిలో విజయవంతంగా అమలు అవుతున్న సీబీడీసీ విధానాన్ని తీసుకురానున్నాం.
దీనివల్ల డిజిటల్ రూపాయి సాయంతో వినియోగదారులు తమకు ఇష్టమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలుంటుంది. ప్రజలకు, రైతులకు పౌర సరఫరాల ద్వారా మేలైన సేవలు అందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అన్నారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీ రావు పాల్గొన్నారు.
