భారాస నియోజకవర్గ స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలను పక్కన పెట్టి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం వారి మానసిక పరిపక్వత స్థితిని సూచిస్తుందని చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హుజురాబాద్ భారాస ఎమ్మెల్యే ఓటు వేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని నియోజకవర్గ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్న పాడి కౌశిక్ రెడ్డి లాంటి నాయకుల కింద పని చేసే ఏనుగు రవీందర్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని విమర్శించడం సిగ్గు చేటని అన్నారు.
ఎన్నికల ప్రచారం లో నియోజక వర్గ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా రెండు సార్లు గెలుపు దరి చేరకున్న నిత్యం ప్రజా క్షేత్రంలో ఉన్న నన్ను గెలిపించాలని కోరుతూ భావోద్వేగానికి గురై ఆయన మాట్లాడిన మాటలను అవహేళన చేస్తూ బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో ఏనుగు రవీందర్ రెడ్డి కించపరిచేలా మాట్లాడడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు.
మందిది అయితే మంగళవారం మనది అయితే సోమవారం అన్న ధోరణి బిఆర్ఎస్ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తుందని, లారీల కొరత ఏర్పడి వడ్ల కొనుగోళ్ళ విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే స్వయంగా లారీలను వడ్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అనుభవజ్ఞుడు, రైతు పక్షపాతి అని చెప్పుకునే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కూడా విమర్శించడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నామని అన్నారు.
వారే స్వయంగా ఎన్నోసార్లు అవినీతి పరుడని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే ని గెలిపిస్తా అంటుంటే చొప్పదండి ప్రజలు నవ్వుకుంటున్న విషయం గమనిస్తే బాగుంటుందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో మేడిపల్లి సత్యం చేస్తున్న అభివృద్ధికి, ఆయన పడుతున్న కష్టానికి కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిపోయిందని సుంకె రవిశంకర్ ని ఎంత లేపాలని చూసినా అది వృధా ప్రయాసగా మాత్రమే మిగులుతుందని ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి చురకలు అంటించారు.
