ఒకప్పుడు దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన అనంతపురం.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకే ఇంజిన్గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడికి ఏకంగా రూ. 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.
జిల్లా యంత్రాంగం చేపట్టిన భూ రికార్డుల డిజిటలైజేషన్, చేనేత రంగ ఆధునీకరణ, స్థానిక యువతకు అందించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఈ కరవు నేలను పారిశ్రామిక, వ్యవసాయ హబ్గా మార్చివేశాయి.
అనంతపురంలో కియా మోటార్స్ రాకతో ఆటోమొబైల్ రంగానికి బలమైన పునాది పడింది. దీనికి అనుబంధంగా రేమండ్ గ్రూప్, ఫౌరేసియా, ఎన్డిఆర్ ఆటో కాంపోనెంట్స్ వంటి సంస్థలు రూ. 4,790 కోట్ల పెట్టుబడులతో తరలివచ్చాయి. వీటితో పాటు పునరుత్పాదక ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్డాక్లో నమోదైన ReNew సంస్థ, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలను కాదని.. ఏపీ ఇంధన విధానానికి ఆకర్షితమై అనంతపురంలో రూ. 22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది.
ఈ ప్రాంతం కేవలం ఆటోమొబైల్, ఇంధన రంగాలకే పరిమితం కాకుండా ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్గా కూడా ఎదుగుతోంది. అనంతపురం నుంచి విడిపోయిన కొత్త జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిష్టాత్మక ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీ 4.0 దీనికి మరింత బలాన్నిచ్చింది.
ఇందులో భాగంగా సరళా ఏవియేషన్ సంస్థ ఎయిర్-టాక్సీ సేవల కోసం రూ. 1,300 కోట్లతో, అలాగే రక్షణ రంగానికి చెందిన ప్రముఖ ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL 900 ఎకరాల్లో భారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి.
ఈ పారిశ్రామిక విప్లవానికి అసలైన పునాది ఇక్కడ జరిగిన భూ సంస్కరణలే. గతంలో IAS అధికారిణి అనితా రామచంద్రన్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ గ్రామా గ్రామాన తిరిగి భూ వివాదాలను పరిష్కరించి, పహాణీలను సరిచేసి రికార్డులను డిజిటలైజ్ చేసింది. ఆ తర్వాత డ్రోన్ మ్యాపింగ్ ద్వారా భూ హక్కులు పారదర్శకంగా మారడంతో పరిశ్రమల స్థాపనకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ సులువుగా అందుబాటులోకి వచ్చింది. ఈ పారదర్శకత పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచింది.
పరిశ్రమలతో పాటే ఇక్కడి వ్యవసాయ రంగం కూడా ఊహించని రీతిలో పుంజుకుంది. ఒకప్పుడు కేవలం వేరుశనగ, మిరప పంటలకే పరిమితమైన ఈ జిల్లా.. హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులు, మైక్రో ఇరిగేషన్ విధానాల వల్ల ఇండియన్ ఫ్రూట్ బౌల్గా మారింది.
దేశంలోని మొత్తం అరటి, మామిడి, దానిమ్మ, జామ, సపోటా పండ్ల సాగులో నాల్గవ వంతు వాటా అనంతపురం జిల్లాదే. ఇక్కడి పండ్లు లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ. 30,000 కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ను, రైతులకు భారీ సబ్సిడీలను ప్రకటించింది.
అనంతపురం జిల్లా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎక్స్ప్రెస్వేల కూడలిలో ఉండటం వల్ల రవాణా పరంగా ప్రయోజనం చేకూరింది. ఇక్కడి ఉత్తరాది మార్కెట్లకు, పోర్టులకు తరలించడానికి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి కిసాన్ రైలును ఇక్కడి నుంచే ప్రారంభించారు.
నీటి ఎద్దడి ఉన్న పంటల నుండి ఎక్కువ ఆదాయం ఇచ్చే పండ్ల తోటల వైపు రైతులు మారడంతో జిల్లా ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు జైసల్మేర్ తర్వాత దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదైన అనంతపురం..ఇవాళ హరిత విప్లవానికి, ఆర్థిక ప్రగతికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది.
