అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి లోహిత ఫార్మా పరిశ్రమలో విష వాయువులు లీకయ్యాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కెమిస్ట్ తాళ్ల దుర్గారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వాయు లీకేజీని గమనించిన ఆయన సహచర ఉద్యోగులు వెంటనే స్పందించి, దుర్గారావును చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పరవాడ పోలీసులు తక్షణమే స్పందించారు. ప్రమాదం జరిగిన లోహిత ఫార్మా పరిశ్రమకు చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. అసలు విషవాయువు లీకేజీకి గల కారణాలేమిటి? యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఫార్మాసిటీలో వరుసగా జరుగుతున్న ఇటువంటి ప్రమాదాలు స్థానిక కార్మికులు, ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
