సనత్నగర్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగస్వాములను చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన SIR కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీతో SIR ప్రక్రియ గడువు ముగియనున్నందున ప్రతి ఓటరు ఎన్యుమరేటర్ ఫారాన్ని సమర్పించారా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించారు. SIR అనేది కేవలం BLOలు, BLAలు లేదా రాజకీయ పార్టీల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఓటరు తన బాధ్యతగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.
ఎన్యుమరేటర్ ఫారం అందని ఓటర్లు ఎవరైనా ఉంటే వారికి వెంటనే ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పార్టీ నాయకులకు సూచించారు. BLAల సహకారంతోనే SIR కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
అయితే, కొన్ని ప్రాంతాల్లో BLOలు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని తలసాని ఆందోళన వ్యక్తం చేశారు. BLOలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే BLAలు లేదా రాజకీయ పార్టీల జోక్యం అవసరం ఉండదని, ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
