హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ ను పదవి నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలంగాణ హైకోర్టు ప్రాథమికంగా గుర్తించింది.
కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కూల్చివేతలు నిర్వహించడం న్యాయవ్యవస్థ అధికారాన్ని సవాలు చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది “రూల్ ఆఫ్ లా” (చట్ట పరిపాలన)పై “రూల్ ఆఫ్ మెన్” (వ్యక్తుల ఇష్టారాజ్యం) ఆధిపత్యం చెలాయించడానికి చేసిన ప్రయత్నానికి నిదర్శనమని, ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని స్పష్టం చేసింది.
న్యాయస్థానాల ఉత్తర్వులను అమలు చేయడం ప్రతి ప్రభుత్వ అధికారి రాజ్యాంగబద్ధ బాధ్యత అని హైకోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే చర్యలు సహించబోమని, చట్టపరమైన పాలనను కాపాడడం న్యాయవ్యవస్థ ప్రధాన బాధ్యత అని వ్యాఖ్యానించింది.
ఈ కేసులో హైడ్రా అధికారులు కోర్టు ఇచ్చిన రక్షణ ఉత్తర్వులను పక్కనపెట్టి కూల్చివేతలు చేపట్టినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది. కమిషనర్గా కొనసాగుతున్న ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగిందని భావించిన న్యాయస్థానం, ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ వ్యాఖ్యలు తెలంగాణలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై కొనసాగుతున్న వివాదానికి కొత్త మలుపు తిప్పాయి. హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.
