వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మరో భారీ ఆర్ధిక ప్యాకేజీ రెడీ అవుతోంది. ఉక్కు కర్మాగారానికి 8 వేల కోట్ల రూపాయల సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. భారీ నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని గతంలో భావించినా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రక్రియ ఆగిపోయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో విశాఖ స్టీల్ ప్లాంట్కి 2024లో మోడీ ప్రభుత్వం 11 వేల 500 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన రాయితీలు.. ఇతర ఆర్ధిక వెసులుబాట్లతో సంస్థకు దాదాపు 15 వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి వచ్చాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక సాయం, సహకారంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2026 జనవరిలో లాభాల్లోకి వచ్చింది. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ను ఆపరేషన్లోకి తీసుకొచ్చి.. ఉత్పత్తి సామర్ధ్యాన్ని 90 శాతానికి పెంచడంతో.. చాలా సంవత్సరాల తర్వాత సంస్థ 54 కోట్ల రూపాయల క్యాష్ ప్రాఫిట్ సాధించింది.
నష్టాల్లో నుంచి లాభాల్లోకి వచ్చింది గానీ.. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నెత్తిన 39 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ లోన్లకు అసలు, వడ్డీలు చెల్లించడం భారంగా మారింది. స్టీల్ ప్లాంట్కి వచ్చే ఆదాయంలో చాలా వరకు నిర్వహణ ఖర్చులకు.. అప్పులకే పోతుండటంతో.. లిక్విడ్ క్యాష్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద నగదు లభ్యత పెంచడానికి.. ఎక్కువ వడ్డీ అప్పులు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజీని సిద్ధం చేసింది. 8 వేల 97 కోట్ల రూపాయలను పంప్ చేయడం ద్వారా ఉక్కు కర్మాగారం ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.
కోకింగ్ కోల్ ఓవెన్లను ఆధునీకరించి నిర్వహణ వ్యయాలు తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 2019లో 2 వేల 500 కోట్లతో 5వ కోకింగ్ కోల్ ఓవెన్ బ్యాటరీని నిర్మించారు. బ్లాస్ట్ ఫర్నేస్, కోకింగ్ కోల్ ఓవెన్ల నుంచి వృధాగా పోతున్న వేడిని ఉపయోగించి విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. దీని వల్ల స్టీల్ ప్లాంట్కి కరెంటు ఖర్చులు మిగులుతున్నాయి.
నిర్వహణ నష్టాల నుంచి కోలుకొని లాభాల బాటపట్టిన విశాఖపట్నం స్టీల్ప్లాంట్.. ఇప్పుడు అప్పులు తీర్చడం మీద దృష్టి పెట్టింది. అయితే 39 వేల కోట్ల భారీ రుణ భారాన్ని దించుకోవడం అంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదు. అదొక సుదీర్ఘ ప్రక్రియ. ఇక కొత్త ఆర్ధిక ప్యాకేజీ ప్రకటనతో.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ విపక్షాలు చేసే ఉత్తుత్తి ప్రచారాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను అడ్డుకోవడమే కాకుండా.. కేంద్రంలోని మోడీ సర్కారు సాయంతో.. సంస్థను లాభాల బాట పట్టించి.. దీర్ఘకాల మనుగడ కోసం కృషి చేస్తున్నారు. తాజా ప్యాకేజీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
