ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం చోటుచేసుకుంది. పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఏలూరుకు చెందిన జనసేన నాయకుడు బొత్స మధు ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
పరిస్థితిని వెంటనే గమనించిన వ్యక్తిగత భద్రత సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై దాడికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో పార్టీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న వర్గ విభేదాలపై తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. పార్టీలోని కొందరు నాయకులు, పెత్తందారులు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం తాను కట్టుబడి పనిచేస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తుండగా, పార్టీ నాయకత్వం కూడా సంఘటనపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
