మాదకద్రవ్యాల వినియోగంపై యువతలో చైతన్యం కల్పించే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా భీమిలిలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. “డ్రగ్స్ వద్దు – చదువే ముద్దు” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ మద్దతు ప్రకటించారు. భీమిలి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక కళాశాలలు, డైట్ కళాశాల, ఏఎంజీ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
భీమిలి గంటస్తంభం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా భీమిలి బీచ్ వరకు సాగింది. విద్యార్థులు చేతుల్లో అవగాహన ప్లకార్డులు పట్టుకుని “డ్రగ్స్ వద్దు – చదువే ముద్దు”, “మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి”, “ఆరోగ్యవంతమైన యువతే దేశానికి బలం” వంటి నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ర్యాలీని చూసిన స్థానికులు కూడా విద్యార్థులను అభినందిస్తూ మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ర్యాలీ అనంతరం భీమిలి బీచ్ వద్ద ప్రత్యేక అవగాహన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్వో మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారిన పడితే యువత భవిష్యత్తు, ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, మాదకద్రవ్యాలకు అలవాటు పడితే విద్య, ఉద్యోగం, వ్యక్తిత్వం అన్నీ ప్రమాదంలో పడతాయని వివరించారు.
విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి చదువును ప్రాధాన్యంగా తీసుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులను కూడా చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని పలువురు అభిప్రాయపడ్డారు.
