అమరావతి రాజధాని ప్రాంత రైతులకు సంబంధించి ఈ-లాటరీ విధానంలో 115 రిటర్నబుల్ ప్లాట్లను పూర్తిగా పారదర్శకంగా కేటాయించినట్లు ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీ సీఆర్డీఏ) అధికారులు వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి అక్రమాలు లేదా లోపాలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శక విధానంలో ప్లాట్ల కేటాయింపు జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.
కేటాయించిన ప్లాట్లు అన్నీ రోడ్డు శూల లేకుండా, రోడ్డు విస్తరణలో పోకుండా ఉండే ప్రాంతాల్లో కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఇవననీ ల్యాండ్ అక్విజిషన్ పరిధిలోకి రాని స్థలాల్లో మాత్రమే ఉన్నాయని తెలిపారు. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర వేదికల్లో వ్యక్తం చేస్తున్నట్లు పల్లపు ప్రాంతాలు, సమాధుల సమీపంలో ప్లాట్లు కేటాయిస్తున్నారనే ప్రచారం పూర్తిగా అపోహ మాత్రమేనని అధికారులు ఖండించారు.
అలాగే దక్షిణ ముఖంగా ఉన్న ప్లాట్లను మొదటి నుంచే రోడ్డు శూల ప్లాట్లుగా పరిగణించలేదని, అవన్నీ లేఅవుట్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని వెల్లడించారు. మొత్తం ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ రిటర్నబుల్ ప్లాట్ లేఅవుట్ రూల్స్ ప్రకారమే సాగిందని, రైతుల హక్కులకు భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఏపీ సీఆర్డీఏ అధికారులు తెలిపారు.
