భారత్–కెనడా దేశాలు వాణిజ్య చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో నిర్ఘాంతపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. కెనడాలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తాడనే ఆరోపణలు ఉన్న అంతర్జాతీయ నేరస్తుడు లారెన్స్ బిష్ణోయ్ భారత ప్రభుత్వం తరపునే ఈ నేరాలు కొనసాగిస్తున్నాడని కెనడాకు చెందిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) రూపొందించిన ఓ రహస్య నివేదిక ఆరోపించింది.
లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్నాడు. గ్లోబల్ న్యూస్కు లభించిన ఈ నివేదిక ప్రకారం, బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో తన హింసాత్మక కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా, సిక్కు వేర్పాటువాదులు, ఉగ్రవాద కార్యకలాపాలను చేసేందుకు “భారత ప్రభుత్వ తరఫున పనిచేస్తున్నాడు” అని పేర్కొంది. ఈ రహస్య నివేదిక కెనడియన్ మీడియాకు చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గ్లోబల్ న్యూస్ బుధవారం విడుదల చేసిన ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం, గుజరాత్ జైలు శాఖ లేదా భారత హైకమిషన్ ఇప్పటివరకు స్పందించలేదు. లారెన్స్ బిష్ణోయ్ జైల్లో నుంచే బెదిరింపులు, డ్రగ్ రవాణా, అద్దె హత్యలను నడిపిస్తున్నాడని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2024 అక్టోబర్ 15న కెనడా తొలిసారిగా బహిరంగంగా, భారత ప్రభుత్వ ఏజెంట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించింది.
మా దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి
భారత ప్రభుత్వ ఏజెంట్లు బిష్ణోయ్ నెట్వర్క్తో సమన్వయంతో విస్తృతమైన నేర కార్యకలాపాలను నిర్వహిస్తున్నారన్న “గణనీయమైన సమాచారం” తమ వద్ద ఉందని RCMP అప్పట్లో పేర్కొంది. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తూ, వాటిని “అసంబద్ధమైనవి, రాజకీయ ప్రేరణతో చేసినవి”గా అభివర్ణించింది. ప్రతిస్పందనగా ఆరు కెనడియన్ దౌత్యవేత్తలను దేశం నుంచి పంపివేయడంతో పాటు, ఒట్టావాలోని తన రాయబారిని వెనక్కి పిలిపించింది.
బిష్ణోయ్ 2015 నుంచి భారతదేశంలో జైలులో ఉన్నప్పటికీ, “జైలు నుంచే తన సంస్థను కొనసాగిస్తున్నాడని” ఆరోపణలు ఉన్నాయి. గోల్డీ బ్రార్ (అసలు పేరు సతిందర్జీత్ సింగ్) వంటి అనుచరులతో కలిసి, భారత్, ఉత్తర అమెరికా, యూరోప్ సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 మంది సభ్యులతో కూడిన నెట్వర్క్ను అతడు పర్యవేక్షిస్తున్నాడని నివేదిక పేర్కొంది.
కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ అనేక బెదిరింపు వసూలు కేసులు, కాల్పుల ఘటనలతో సంబంధం కలిగి ఉందని RCMP తెలిపింది. డబ్బు శుద్ధి, కాంట్రాక్ట్ హత్యలు వంటి నేర కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ గ్యాంగ్ హింసను ఉపయోగిస్తోందని నివేదికలో ఉంది. ఖలిస్తాన్ వాద అనుకూల నాయకులపై దాడులను నిర్వహించేందుకు బిష్ణోయ్ సిండికేట్ వంటి గుంపులను భారత అధికారులు వినియోగించారని నివేదిక ఆరోపిస్తోంది.
2023లో బ్రిటిష్ కొలంబియాలోని సరీలో హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య, విన్నిపెగ్లో సుఖ్దూల్ సింగ్ హత్యలను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ ఇద్దరినీ భారత్ ఉగ్రవాదులుగా గుర్తించింది. నిజ్జార్ హత్యకు సంబంధించి సీనియర్ భారత అధికారులను కలిపేలా ఉన్న ఇంటర్సెప్టెడ్ కమ్యూనికేషన్లు ఉన్నాయని నివేదిక పేర్కొంటూ, భారత్–కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయని గ్లోబల్ న్యూస్ కథనం వెల్లడించింది.
