నల్గొండహోమ్

యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదు

#UttamkumarReddy

విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వారి గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దేశ యువత ఉద్యోగాలు అడిగితే లాఠీలు… పరీక్షల్లో పారదర్శకత కోరితే నిర్బంధాలు… జవాబుదారీతనం కోరితే బెదిరింపులు… ఇదే బీజేపీ పాలనకు అసలు ముఖచిత్రమని ఆయన విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలి ఆయన కేంద్రపై విరుచుకుపడ్డారు.

“ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు… ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అణచివేయడమే ప్రజాస్వామ్యానికి అసలైన ముప్పు” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వారి బాధను వినకుండా అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. భయంతో దేశాన్ని పాలించాలని చూసే ప్రతి ప్రభుత్వం చివరికి ప్రజల తీర్పు ముందే తలవంచాల్సి వచ్చిందని చరిత్ర చెబుతోందన్నారు.

విద్యార్థుల మధ్యకు వెళ్లి వారి ఆవేదనను పంచుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిజమైన ప్రజానాయకుడిగా నిలిచారని ఆయన కొనియాడారు. “ప్రజల మధ్య నిలబడే నాయకుడు ఒకరు… ప్రజల నుండి దూరంగా నిలబడి అధికారాన్ని కాపాడుకునే నాయకత్వం మరొకటి. దేశ యువత ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా గుర్తిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.

అసత్య ప్రచారాలతో, విద్వేష రాజకీయాలతో, దర్యాప్తు సంస్థల భయంతో ప్రజల స్వరాన్ని శాశ్వతంగా అణచివేయలేరని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. “విద్యార్థుల కలలను సంకెళ్లతో బంధించలేరు… యువత ఆశయాలను జైళ్ల గోడల మధ్య నిర్బంధించలేరు… రాజ్యాంగాన్ని ఎవరూ ఓడించలేరు” అని ఆయన అన్నారు.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన ప్రశ్నించే హక్కును కాపాడటం కాంగ్రెస్ పార్టీ చారిత్రక బాధ్యతగా భావిస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత, సామాన్య ప్రజల హక్కుల కోసం నిరంతరం చేస్తున్న పోరాటం కోట్లాది యువతలో కొత్త ఆశను నింపుతోందన్నారు.

దేశ యువత ఇప్పుడు విద్వేషాన్ని కాదు… విశ్వాసాన్ని కోరుకుంటోందని, అహంకారాన్ని కాదు… జవాబుదారీతనాన్ని కోరుకుంటోందని, ప్రచారాన్ని కాదు… పారదర్శక పాలనను కోరుకుంటోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

2029 లోక్‌సభ ఎన్నికలు కేవలం అధికార మార్పు కోసం జరిగే ఎన్నికలు కావని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, యువత భవిష్యత్తును కాపాడే ఎన్నికలుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి సమగ్ర, సమానత్వ, రాజ్యాంగబద్ధ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని, 2029లో ప్రజల ఆశీర్వాదంతో ఆయన దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతారనే పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తోందని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, “ప్రజల గొంతును వినే ప్రభుత్వాలే చరిత్రలో నిలుస్తాయి. అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూసే ప్రభుత్వాలకు ప్రజలే తగిన తీర్పు ఇస్తారు” అని హెచ్చరించారు.

Related posts

భారీగా ఉద్యోగాలలో కోత పెట్టిన మైక్రోసాఫ్ట్

Satyam News

కుట్ర రాజకీయం చేస్తున్న నేరగాళ్లు

Satyam News

అక్రమ లే-అవుట్లు, నిర్మాణాలపై ఉక్కుపాదం

Satyam News

ఐఏఎఫ్‌కు త్వరలో 5 తేజస్ మార్క్–1ఏ యుద్ధవిమానాలు

Satyam News

గ్రామీణ వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మే విబి జి రామ్‌జి ప‌థ‌క లక్ష్యం

Satyam News

ఐఆర్జీసీ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

Satyam News

Leave a Comment